28, మే 2017, ఆదివారం

వెన్నెలవే వెన్నెలవే - My thoughts


దేవా & ప్రియా
సన్నివేశం & ఉపోద్ఘాతం: పెళ్లిచేస్కో మని విసిగిస్తున్న.. దేవా పై అరుస్తుంది ప్రియా. దాని గురించి తనతో మాట్లాడకు అని హెచ్చరిస్తుంది. అప్పుడు దేవా.. ఈ పాటను పాడడటం మొదలెడుతాడు. సాధారణంగా.. మనం మాట్లాడాల్సి వున్నప్పుడు.. ఎదుటివారు మనతో మాట్లాడడానికి ఇష్టపడనప్పుడు.. అతని/ఆమె ఎదురుగానే మూడోవ్యక్తికి ఇండైరెక్టుగా.. చెప్తాం. ఈ పాటలో కూడా అదే జరుగుతుంది. ఆ మూడోవ్యక్తే వెన్నెల. ప్రేమ గురించి వెన్నెలతో మాట్లాడుతూ.. వెన్నెలని బుజ్జగిస్తూ.. తన చుట్టూ ఆవరణాన్ని.. వివరిస్తూ... ప్రకృతి లోని ప్రేమని,ప్రేమ ప్రకృతిని గ్రహించిన మరుక్షణం.. 'పిల్లా' అంటూ…  ప్రియా కు వివరిస్తాడు దేవా. 
ఈ పాటని హరిహారన్ చాలా అద్భుతంగా పాడారు. కానీ.. చాలా తెలుగు పదాలను, వాటి ముగింపులను మింగేశారు. ఉదాహరణకు.. "పాడేడు కుసుమాలు పచ్చ గడ్డి మీన" ను అనేకారకాలుగా అర్థంచేస్కోవచ్చు. అది పాడేడో.. లేక పాడేనో..? 'పచ్చగడ్డి' ను 'పచ్చకంటి' అని.. తర్వాతి పదం.. మీదా/మీనా/మీన నో తెలియదు. అలాగే 'ఎద' ను 'ఇది' అని, '' ను '' అని, 'శయ్యంకు' ను 'సాయంత్రం' అని    'చలి' ను 'చెలి' అని పాడారు. అందుకే ఈ పాటకు చాలా వెర్షన్స్ మనకు కనబడతాయి. 

దీని మాతృక అయిన తమిళంలో, వైరముత్తు గారి.. కవిత్వం ఒక్కమాటలో చెప్పాలంటే అతి అద్భుతం. దాదాపు అదే అర్థాన్ని , అందాన్ని వేటూరి గారు తెలుగులో ఆవిష్కరించారు. అనువాద పాటల్లోకూడా తనదైన శైలిలో పదాల ప్రయోగాలు చేస్తూ.. అద్భుతమైన.. అర్థవంతమైన సాహిత్యాన్ని రాయడం ఆయనకే చెందింది. వైరముత్తు గారి భావం, వేటూరి గారి సాహిత్యం చదివాక.. విరిరువురి కవితా ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. ఏ ఆర్ రెహ్మాన్ గారి ట్యూన్స్కు.. తమిళంలో.. వైరముత్తు.. తెలుగులో వేటూరి గారు ఎన్నో అద్భుతమైన పాటలు రాసారు. వాటిలో ఇది ఒకటి. నాకు అర్థమైన భావాన్ని.. తెలిపే ప్రయత్నం చేసాను. తప్పులుంటే గుర్తించి.. వివరించి.. సరిచేయగలరు.

పల్లవి:
వెన్నెలవే వెన్నెలవే, మిన్నే దాటి వస్తావా? విరహానా జోడీ నీవే.. -2
వెన్నెలవే వెన్నెలవే, మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే..
నీకు భూలోకులా కన్ను సోకేముందే, పొద్దు తెల్లారేలోగా పంపిస్తా..
వెన్నెలవే వెన్నెలవే, మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే..
[విరహం. కోరుకున్న వ్యక్తి వదిలివెళ్లడం లేదా.. ప్రక్కన లేకపోవడం. ప్రియా వున్నా.. మాట్లాడొద్దు అందికనుక, ఈ విరహాన జోడిగా నువ్వు ఆకాశాన్ని దాటి వస్తావా? అని దేవా వెన్నెలతో అంటున్నాడు. ఎటువంటి ఇబ్బంది లేకుండా.. ఎవ్వరూ చూడకముందే.. పొద్దు పొడవకముందే.. తిరిగి పంపిస్తానని కోరుతున్నాడు]

చరణం:1
ఇది సరాసాలా తొలిపరువాలా జత శయ్యంకు సైఅన్న మందారం -2
చెలి అందాలా చలి ముద్దాడే చిరు మొగ్గల్లో సిగ్గేసే పున్నాగం
పిల్లా… పిల్లా
భూలోకం దాదాపు కన్నూ మూయు వేళా ..
పాడేడు కుసుమాలు పచ్చా గడ్డి మీన..
పూవుల్లో తడి అందాలోఅందాలే ఈ వేళా.


[చరణంలో.. తనచుట్టూ ఉన్న రొమాంటిక్ వాతావరణాన్ని చెప్తున్నాడు. ఒక మందారం ఉంది, అది  సరసాల, యవ్వనంలో వున్న ఒక జంట, శయ్యపైకి వెళ్లేటట్లు చేయగల మందారం. ఒక పున్నాగం ఉంది. అది 'చెలి అందాలు' కలిగినటువంటి చలి, తన చిరు మొగ్గల్ని ముద్దాడుతుంటే సిగ్గుపడుతుంది. ఇలా వెన్నెలతో మాట్లాడుతూ.. వున్నట్లుండి.. ప్రియా వైపు తిరిగి... ప్రకృతిలోని నిర్జీవాలు కూడా ఎలా ప్రేమించుకుంటాయో చెప్తాడు. భూలోకం దాదాపు కన్నుమూయు వేళా.. అంటే ఒక ప్రశాంతమైన సాయంత్రం. పాడేడు కుసుమాలు పచ్చ గడ్డి మీన - ప్రశాంత సాయంత్ర సమయంలో... పుష్పాలు సైతం. గాలికి ఊగుతూ... తమ చుట్టువుండే పచ్చగడ్డి మీద (మీన అంటే మీద లేదా పైన అను అర్థం) పాటలు పాడుకుంటూ ప్రేమని తెలుపుకుంటాయి తెలుసా? అని అంటాడు.ఈ పువ్వులో తడి అందాలో.. అందాలే ఈ వేళా- అందం వేళను బట్టి మారుతుంది. బాల్యంలో అల్లరి అందం, యవ్వనంలో బాధ్యత అందం, వృద్ధాప్యంలో జ్ఞాపకాలు అందం అనుకున్నట్లు.. వాళ్లిద్దరూ ప్రస్తుతం ఉన్న వాతావరణంలో ఆ మందారం.. సిగ్గుపడే పున్నాగం యొక్క అందలే నిజమైన అందాలుగా అనిపిస్తున్నాయి అంటున్నాడు.]

వెన్నెలవే వెన్నెలవే, మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే..
నీకు భూలోకులా కన్ను సోకేముందే, పొద్దు తెల్లారేలోగా పంపిస్తా..

[ఎలా అయితే.. దేవా.. వెన్నెలతో.. మాట్లాడుతూ ఆరంభిస్తాడో.. అతని పదాలకు పరవశించిన ప్రియా.. అదే వెన్నెలతో మాట్లాడడం.. ఆ వెన్నెల గురించి ప్రశ్నలు వేయడం మెడలేడుతుంది. ఆ పరవశాన్ని గమనించిన దేవా (ప్రభుదేవా) ఎదో అనుభూతితోటి తబ్బుబైపోతాడు (నేషనల్ అవార్డ్ కోరియోగ్రఫీ మరీ). పాటలోని ఈచోట.. అధ్భూతమైన ఇంటర్ల్యుడ్ ఉంటుంది.]

చరణం:2
ఎత్తైనా గగనంలో నిలిపేవారెవరంటా?
కౌగిట్లో చిక్కుపడే గాలికి అడ్డెవరంటా ?
ఇది గిల్లీ గిల్లీ వసంతమే ఆడించే,
హృదయములో వెన్నెలలే రగిలించేవారెవరూ?
పిల్లా... పిల్లా...
పూదోట నిదరోమ్మని పూలే వరించు వేళా..
పూతీగ కలలోపల తేనే గ్రహించు వేళా..
ఆ వయసే రసాల విందైతే .. ప్రేమల్లే ప్రేమించు.

వెన్నెలవే వెన్నెలవే, మిన్నే దాటి వస్తావా విరహానా జోడీ నీవే..
నీకు భూలోకులా కన్ను సోకేముందే, పొద్దు తెల్లారేలోగా పంపిస్తా..!!

[రెండవ చరణంలో.. ప్రియా.. విచిత్ర ప్రశ్నలను అడుగుతుంది. ఇక్కడ వైరముత్తు గారి లైన్స్... వేటూరి గారి లైన్స్ చాలావరకు వేరుగా ఉంటాయి. వెన్నెలను అంత ఎత్తు ప్రదేశంలో ఎవరు పెట్టుంటారు అని, ప్రేమికుల కౌగిట్లో ఉండిపోవలనుకొనే గాలిని ఎవరు అడ్డుకోగలరు? అని ఆమె అడగగా..  తనకున్న ప్రశ్నకూడా అడుగుతాడు దేవా. ఎద గిల్లి గిల్లి వసంతాన్నే ఆడించె.. హృదయములో వెన్నెలలే రగిలించేవారేవారు? ఇక్కడ వసంతం అంటే.. అదొక ప్రాచీనమైన రాగం. పూర్వులు దీనిని రాగాంగము అని పిలిచేవారు. వారి సిద్ధాంతము ప్రకారం ఇది హిందోళ జన్యము. ఎదనుపయోగిస్తూ.. ఆ రాగంలో పాడే (ఆడించె) వాళ్ళ హృదయంలో వెన్నెలలే(ప్రశాంతత అనుకుంటున్నాను) ఎవరు రగిలించగలరు? అంటాడు. పూలే పుతోటను నిదరోమని చెప్పే వేళా... పూతీగ కలలో తేనెను గ్రహించే వేళా..  అని ప్రియా ఎదో పాడబోతున్నట్లు వున్నా.. దేవా.. అడ్డుపడి.. ఆ వయసే రసాల విందైతే.. ప్రేమల్లే ప్రేమించు -ఇక్కడ వయసు అంటే యవ్వనం.. రసం అంటే ఎమోషన్ (నవరసాలు లోనిది). నువ్వు, యౌవనాన్ని ఒక రసాల విందుగా పరిగణించిన రోజు.. ప్రేమల్లే ప్రేమించు అంటే.. సరిగ్గా ఎలా చెప్పాలో తెలియట్లేదుకాని.. ఒక తల్లి తన బిడ్డల్లల్ని ప్రేమించినట్లు ప్రేమించు అని అనిపిస్తుంది] - ఆరిఫ్.టీ.యం.డీ     




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి